శర్మ కాలక్షేపంకబుర్లు-మెరుగు బంగారంబు మ్రింగబోడు

సీII తల్లి గర్భమునుండి ధనము దేడెవ్వడు,
వెళ్ళి పోయెడినాడు వెంటరాదు;
లక్షాధికారైన లవణ మన్నమెకాని,
మెరుగు బంగారంబు మ్రింగబోడు;
విత్తమార్జనజేసి విర్రవీగుటె కాని,
కూడబెట్టిన సొమ్ము గుడువబోడు;
పొందుగా మరుగైన భూమిలోపల బెట్టి,
దానధర్మము లేక దాచి దాచి;
తేII తుదకు దొంగల కిత్తురో ? దొరల కవునొ ?
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు ?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

    తల్లి గర్భం నుంచి బయట పడేటప్పుడు డబ్బు మూట కూడా తేడు, పోయేటపుడు నూలుపోగు కూడా తీసుకుపోడు. ఎంత ధనవంతుడైనా అన్నమే తింటాడు తప్పించి బంగారపు కణికలు మింగడు. సొమ్ము సంపాదించి, కూడబెట్టి ఇతరుల మీద సవారీ చేయడం తప్పించి, చచ్చిన తరవాత ఒంటి మీద బట్టకూడా లేకుండానే కాల్చి పారేస్తారు, అప్పటివరకు అయ్యగారని వంగి నమస్కారం పెట్టినవాడే, కర్రతో పొడిచి పొడిచి కాల్చి పారేస్తాడు, చితి మీద. కూడా ఏం రాదు. సొమ్ము సంపాదించి భూమిలో గొయ్యితీసి పాతేస్తారు, తాము అనుభవించరు, మరొకరికి దానమూ చెయ్యరు. పాత కాలపు దాపరికాలెలా ఉండేవంటే, పడుకునే మంచం తలదిక్కున మంచానికే ఉన్న పెట్టెలో దొంగ అరలో దాచేవారు. మరికొందరు, మంచం దిగే దగ్గర కాళ్ళ వైపు గొయ్యితీసి అందులో పాతేసి, పైన అలికేవారు, మిగతా నేలతో సహా! పడుకునే మంచం నాలుగు కోళ్ళ కిందా గొయ్యి తీసి పాతేసేవారు, మంచం కదిలించేవారు కాదు. గోడలో పాతేసేవారు. దేవుని మందిరం కింద గోతిలో కప్పెట్టేవారు. ఇలా పోగేసిన సొమ్ము దొంగలు బలవంతంగా గుంజుకుపోవచ్చు, లేదా ప్రభుత్వమే కొల్లగొట్టేయచ్చు. తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను సంగ్రహించి నిలవచేసి మానవులకిస్తాయి, వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలుసా? కింద మంట పెట్టి ఈగలను పట్టునుంచి తరిమేసి తేనె పిండుకుంటారు, అలా కుదరకపోతే కాల్చేస్తారు.. ఇలా ఎందుకు మానవులు సొమ్ము పోగుచేయడానికి కష్టపడతారో అంటారు, శేషప్ప కవి.

ఈ మధ్య కొంతమంది సొమ్ము ఖర్చు పెడుతున్నారు,ఎందుకు? పేరు కోసం పెట్టుబడి, మరింత సంపాదనకే. ఇక పెళ్ళిలో ఆడంబరాలకి భోజనాలకి ఖర్చు చేస్తున్నారు. అమ్మో! వారింట పెళ్ళిలో 64 రకాలు చేసారంటే, మనింట్లో మరో పదెక్కువ అన్నట్టు వంటలు చేయించి వడ్డించడం మొదలెట్టేరు. ఎవరు తిన్నా అజానెడు కడుపుకే. ఒక సారి నిండుగా తింటే ఇక వద్దు అంటాడు. వద్దనిపించగలది అన్నదానమొక్కటే, మరొకటి లేదు. మానవులు ఎంత తింటారు? పప్పు, రెండు కూరలు, రెండు పచ్చళ్ళు, ఒక తీపి, ఒక కారా. అబ్బో ఇది తినడమే చాలా ఎక్కువ, మరి అరవైనాలుగు తయారు చేయడం? గోతి పాల్జేయడానికా?

ఈ మధ్య ఇలా ఎక్కువ వెరైటీలు చేయడం మానేశారు, ఏం జేస్తున్నారూ? బంగారపు రేకులు వడ్డిస్తున్నారు. నిజమే చెబుతున్నా! ఇలా బంగారాన్ని ఆహారంతో తీసుకోవడం కొత్త మాటేం కాదు. చాలా పాత కాలం నుంచే బంగారపు రేకుల్ని ఆహారంతో తీసుకోవడం భారతీయులకు అలవాటే. ఇదెందుకు? బంగారం కూడా ఔషధంగా గుర్తించారు,భారతీయులు. బంగారాన్ని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు, అలాగే హోమియోలో బంగారం ఒక మందుగా వినియోగిస్తారు. కలిగినవారు ఇలా బంగారపు రేకులు తినడం అలవాటే! దాన్నే ఇప్పుడు కలిగినవారు గొప్ప కోసం బంతి మీద వడ్డిస్తున్నారు. ఎలా తింటారని కదా! వేడి వేడి అన్నం మీద ఈ బంగారం రేకు వేస్తే అది కరిగిపోతుంది, దానిలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక ఆధరువుతో తినెయ్యచ్చు. ఇది నేటి గొప్పవారి బంగారం మింగడం కత.

కొసమాట:- కొసరు మాట కాదూ! 25 బంగారపు రేకులు ఖరీదు దగ్గరగా ఐదువేలు, బజారులో దొరుకుతున్నాయి.ఈ పరిశ్రమ మన దేశంలో చాలా కాలంగానే ఉన్నది. ప్రయత్నించండి,మీదే ఆలస్యం 🙂

శర్మ కాలక్షేపంకబుర్లు-రోజులు మారాయి-పొలాలమ్ముకుని…

రోజులు మారాయి-పొలాలమ్ముకుని…

కల్లాకపటం కానని వాడా! లోకం పోకడం తెలియని వాడా!!
ఏరువాక సాగారో రన్నో… చిన్నన్నా నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా!!

నవ ధ్యానాలను గంపకెత్తుకొని… చద్ది అన్నము మూట గట్టుకొని
ముల్లు గర్రను చేతబట్టుకొని… ఇల్లాలును నీ వెంటబెట్టుకొని………Iఏరువాక!

పడమట దిక్కున వరద గుడేసె… ఉరుముల మెరుపుల వానలు గురిసె
వాగులు వంకలు ఉరవడి జేసె… ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె………..Iఏరువాక!

కోటేరును సరి జూచి పన్నుకో యలపటదాపట ఎడ్ల దోలుకో
సాలు తప్పక పంట వేసుకో విత్తనము లిసిరిసిరి జల్లుకో…..Iఏరువాక!

పొలాలమ్ముకొని పోయేవారు… టౌనులో మేడలు కట్టేవారు
బ్యాంకులో డబ్బును దాచేవారు… నీ శక్తిని గమనించరు వారు…..Iఏరువాక!

పల్లెటూళ్లలో చెల్లని వాళ్లు… పాలిటిక్సుతో బతికే వాళ్లు
ప్రజాసేవయని అరచేవాళ్లు…ప్రజాసేవయని అరచేవాళ్లు… వొళ్లు వంచి చాకిరికి మళ్లరు……Iఏరువాక!

పదవులు స్థిరమని బ్రమిసే వాళ్లే… ఓట్లు గుంజి నిను మరచే వాళ్లే
నీవే దిక్కని వత్తురు పదవోయ్…నీవే దిక్కని వత్తురు పదవోయ్….

రోజులు మారాయ్ రోజులు మారాయ్
మారాయ్.. మారాయ్.. మారాయ్.. రోజులు మారాయ్……Iఏరువాక!

          మొదటి భాగంలో పల్లెలు వ్యవసాయం చెప్పుకున్నాంకదా! ఈ భాగంలో ఆ నాటి సాంఘిక,రాజకీయ,ఆర్ధిక స్థితిగతులు తడువుదాం, కవిగారి మాటల్లో.

ఈ పాట స్వాతంత్ర్యం వచ్చిన ఎనిమిదేళ్ళకి, ఏస్టేట్ అబాలిషన్ ఏక్ట్ వచ్చిన ఏడేళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ రెండేళ్ళకి రాయబడింది, ఆంధ్రాలో టెనన్సీ ఏక్ట్ రావడానికో సంవత్సరం ముందు కాలం. ఈ సినిమా తీయబడింది. ఎస్టేట్ ఎబాలిషన్ ఏక్ట్ కొంతమందికి ఉపయోగపడింది, కొంతమంది ఎస్టేట్ దారులు కూటికి లేక అడుక్కునే స్థితికి చేరిపోయారు. భూమి కౌలుదారలకు స్వంతమెంతయిందో చెప్పలేను, దళారులు బాగుపడ్డారు. ౧౯౫౨ లో జరిగిన ఎన్నికలలో నాటికి ఏకముక్కగా ఉన్న కమ్యూనిస్ట్ లు మద్రాస్ రాష్టంలో గెలిచినంత పని చేశారు, ఎవరికి మజారిటీ రాలేదు, కాంగ్రెస్ వారు సమయాన్ని ఉపయోగించుకుని అధికారం చేజిక్కించుకున్నారు. దున్నేవానిదే భూమి నినాదం, చిన్న కమతాల వారి గుండెల్లో రైళ్ళు పరిగెట్టించాయి. కౌలుదార్లకి దురాశ పుట్టింది. అప్పటికి పల్లెలలో ఎంతో కొంత ఉన్న సౌమనస్యం పూర్తిగా చెడింది. ఒకరిని చూస్తే మరొకరికి భయం పట్టుకుంది, అనుమానం ఊడలు దిగింది. ఇదిగో ఈ సావకాశాన్ని ఉపయోగించుకుని కొత్త పెత్తందార్లు తయారయ్యారు. కౌలు రైతులకు, చిన్న కమత దారులకు చెప్పేలా చెప్పేరు,భయం పెంచారు, విడదీశారు, పాలించారు. చిన్న కమత దారులు భూములు అమ్మకం మొదలు పెట్టేరు, భయంతో, కౌలు రైతు పట్టుకుపోతాడని. కొంతమంది అమ్ముకోనుకూడా లేకపోయారు, రైతూ బాగుపడలేదు, భూమిదారూ బాగుపడలేదు, ఈ పేరున కొన్ని హత్యలూ జరిగాయి. పల్లెలు నివురుగప్పిన నిప్పులా తయారయ్యాయి, ద్వేషాలు పెరిగాయి. కేస్ లు కోర్టులకెక్కాయి,లాయర్లు బాగు పడ్డారు. సమయం ఉపయోగించుకున్న దళారులు భూముల్ని కొన్నారు, బినామీల పేర. కొంతమంది భూమి పోతుందని పెళ్ళానికి విడాకులిచ్చినట్టు పంపకం చేసి, కాపరాలు చేసి పిల్లలనీ కన్నారు. నాడు రెండు పంటలు పండే, నీటి వసతి ఉన్న భూమి ఖరీదు ఎకరాకు మూడు వేలు. కాని భయాన్ని సాకుగా చూపి ఈ భూముల్ని ఎకరం పదిహేనువందలకే నొక్కేశారు. చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నమనుకుని కమతదారులు అమ్ముకున్నారు, పట్నం బాట పట్టేరు.

పట్నం బాటపట్టినవారు టవునుల్లో ఇళ్ళు కట్టేరు, అద్దెలకిచ్చేరు. అద్దెల వసూలుకు, అద్దె ఇవ్వక ఖాళీ చెయ్యక ఇబ్బంది పెడుతున్నవారిని దారిలో పెట్టేందుకు, జబ్బ పుష్టి ఉన్న కొత్త రౌడీలు తయారయ్యారు. వీరిని కొన్ని పార్టీలూ ఆదరించాయి, కొత్త పెత్తందారులు తయారయ్యారు, ఇక్కడా. మరికొంతమంది ఈ బాధలు పడలేక పొలాలమ్ముకుని బేంక్ లో సొమ్ము డిపాసిట్ చేసుకున్నారు, చదువుల పేరుతో ఉద్యోగం పేరుతో, ఇక్కడ బతికేందుకు సావాకాశం లేక దేశాన్నే వదలి వలసపోయారు. ఇటువంటి కుటుంబాలను నేను ఎరుగుదును. ఈ వర్గంవారంటే కవిగారికి కొంచం అభిమానం ఉన్నట్టుంది అందుకే ముందు చెప్పేరు. నీ శక్తి గమనించలేకపోతున్నారు రైతన్నా! అని బాధపడ్డారు.

పల్లెలో బతకాలంటే పని చేయడం తెలియాలి,పని చెయ్యాలి, లేదా పెట్టుబడి పెట్టాలి. ఏపనీ చేయనివారు పాలిటిక్స్ పేరుతో బతకడం మొదలెట్టేరు, వీరికి పార్టీలు ఆదరణ కలిగింది, వీరు ఊళ్ళలో కాంట్రాక్టర్లు, పచ్చగడ్డి పాటదారులు,కొలగారం పాటదారులు, కో ఆపరేటివ్ సొసైటీ పరిపాలకులుగా అవతారాలెత్తేరు. వీళ్ళే ప్రజాసేవ అనే కొత్త పదాన్నీ కనిపెట్టేరు, ప్రజల్ని ఊదరకొట్టడం మొదలెట్టేరు. వీళ్ళు ఏ పనీ చేయకనే బతికెయ్యడం మొదలెట్టేరు, వీరంటే కవిగారికి చాలా తేలిక భావమే కనపడింది.

చివరిగా ఆరోజునాటికే అనగా ఒకసారి ఎన్నికలయ్యేటప్పటికే కవిగారు పదవులే స్థిరం అనుకునేవాళ్ళు, ఓట్లు గుంజుకుని మళ్ళీ కనపడకపోయేవారిని ఈసడించారు, నువ్వే దిక్కని వస్తారన్నారు. కాని కవిగారి అంచనా ఇక్కడే దెబ్బతింది. ఓట్లు ఒకరేసేదేంటీ? మా పెట్టెలో మీ ఓటూ అనేవారు, బయట. అప్పటికి ఓటు కాయితం మీద ముద్ర వేయడం లేదు. ఎవరికి వారికి వేరుగా పెట్టెలుండేవి, అందులో అందరి పేరుతో తామే వేసుకునేవారు, పుట్టనివారు,చచ్చినవారితో సహా!

రోజులు మారాయి! రోజులు మారాయన్నారు, అప్పటికి ఇప్పటికి రోజులేం మారలేదు, అవే రోజులు,అవే గంటలూ,నిమిషాలూ,వారాలూన్నూ. సంవత్సరాలే మారిపోతున్నాయి, మనుషుల బుద్ధులు మారిపోయాయి. రైతు దగ్గర కొచ్చేటప్పటికి ఎవరికి చేతులు ముందుకు రావటం లేదు, మోరలు దిగిపోతున్నాయి.

రైతు బాగుపడకుండానే ఉండాలనేదే నాటికి నేటికీ ఆశయం. పెట్టుబడిలేని వ్యవసాయం అంటే మూతి విరుస్తున్నారు. విత్తనాలు మా కంపెనీలోనే కొనాలి,రైతు విత్తనాలు తయారు చేసుకోడానికి వీల్లేదనే వారొకరు. పని చేయడానికి మనుషులు దొరక్కుండా చేసిన ప్రభుత్వం వారు. యంత్రాలు రైతు కొనలేడు, దొరకవు. పశువులతో పని చేయించడం అన్యాయమనే వారు మరికొందరు. ఎరువులు,పురుగుమందులు లేని వ్యవసాయమంటే ఎరువుల ఫేక్టరీలవారికి, పురుగు మందుల కంపెనీలవారికి మంట.

వీటన్నిటికంటే ముందు రైతుకు విచ్చలవిడిగా దొరుకుతున్నది మాత్రం రకరకాల మందు,మత్తు మందులూ. పురుగులు చావటం లేదు, మందుచల్లితే కాని, రైతు తాగితే మాత్రం ఛస్తున్నాడు, ఇదే చిత్రమో!

రోజులు ఇలా మాత్రం మారేయండి! ఇదండి రోజులుమారాయి కత.

శర్మ కాలక్షేపంకబుర్లు-రోజులు మారాయి-ఏరువాక

రోజులు మారాయి-ఏరువాక

కల్లాకపటం కానని వాడా! లోకం పోకడం తెలియని వాడా!!
ఏరువాక సాగారో రన్నో… చిన్నన్నా నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా!!

నవ ధ్యానాలను గంపకెత్తుకొని… చద్ది అన్నము మూట గట్టుకొని
ముల్లు గర్రను చేతబట్టుకొని… ఇల్లాలును నీ వెంటబెట్టుకొని………Iఏరువాక!

పడమట దిక్కున వరద గుడేసె… ఉరుముల మెరుపుల వానలు గురిసె
వాగులు వంకలు ఉరవడి జేసె… ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె………..Iఏరువాక!

కోటేరును సరి జూచి పన్నుకో యలపటదాపట ఎడ్ల దోలుకో
సాలు తప్పక పంట వేసుకో విత్తనము లిసిరిసిరి జల్లుకో…..Iఏరువాక!

పొలాలమ్ముకొని పోయేవారు… టౌనులో మేడలు కట్టేవారు
బ్యాంకులో డబ్బును దాచేవారు… నీ శక్తిని గమనించరు వారు…..Iఏరువాక!

పల్లెటూళ్లలో చెల్లని వాళ్లు… పాలిటిక్సుతో బతికే వాళ్లు
ప్రజాసేవయని అరచేవాళ్లు…ప్రజాసేవయని అరచేవాళ్లు… వొళ్లు వంచి చాకిరికి మళ్లరు……Iఏరువాక!

పదవులు స్థిరమని బ్రమిసే వాళ్లే… ఓట్లు గుంజి నిను మరచే వాళ్లే
నీవే దిక్కని వత్తురు పదవోయ్…నీవే దిక్కని వత్తురు పదవోయ్….

రోజులు మారాయ్ రోజులు మారాయ్
మారాయ్.. మారాయ్.. మారాయ్.. రోజులు మారాయ్……Iఏరువాక!

   పాట, జానపద కవి కొసరాజు, రోజులు మారాయి చిత్రం కోసం రాసినది. అరవైఏళ్ళ కితం వ్యవసాయం, నాటి పల్లె మాటలు తో, నాటి రాజకీయ, ఆర్ధిక,సాంఘిక ముఖచిత్రాన్ని టూకీగా కూర్చిన పాట. జిక్కి గానం చేయగా మా రాజమండ్రి అమ్మాయి (నేటి అమ్మమ్మ) వహీదా నర్తించినది. నాటి రోజుల్లో సినిమా తో పాటు కథ, పాటల పుస్తకాలూ అమ్మేవారు, ఖరీదు అణా. పాట కోసం చూశాను,సరైన మాటలున్న సాహిత్యం దొరకలేదు, రాజ్యలక్ష్మి గారినడిగితే వారిబ్లాగ్ లో ఇచ్చారు. వారికి ధన్యవాదాలు.

నేటికీ కల్ల కపటం తెలియనివాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు, వీరికి వ్యవసాయమే లోకం, లోకం పోకడ తెలీదు అన్నది, నేటికీ నిజమే. కుళ్ళు,కుచోద్యం ఎక్కువగా అంటనివారు రైతులే, అనుమానం లేదు. ఏ ప్రభుత ఏలినా రైతుకి ఒరిగింది శూన్యం.

ఏఱువాక అన్న పదం ఏఱురాక నుంచి పుట్టిందేమోనని అనుమానం. ఏరు అంటే నాగలి అని వాక అంటే నది,సెలయేరని అర్ధంట. వానొస్తే వరదొస్తదన్నట్టు ఏరొస్తేనే వ్యవసాయం కదా! ఏఱువాకంటే వ్యవసాయం ప్రారంభం, దీని కోసం ఒక రోజు కేటాయించారు,మనవారు. అదే ఆషాఢ శుద్ధ పౌర్ణమి, ఇదేంటీ? ఆషాఢం గీష్మ ఋతువుకదా అని అనుమానం. అవును, గ్రీష్మ ఋతువు చివరికి మిగిలిన పదేనురోజుల ముందు రోజు, తరవాతది వర్ష ఋతువే. ప్రతి ఋతువు చివర పదేను రోజుల్లోనూ ఆ ఋతువు,రాబోయే ఋతువు లక్షణాలు కలిసుంటాయి. అంటే ఈ రోజు నుంచి వర్షము ఎండా కూడా ఉంటాయనమాట. ఈ రోజు మరే శంక లేక ఏరువాక అనగా వ్యవసాయ పనులు మొదలెట్టమన్నారు, చేయమన్నారు. చినుకురాక వ్యవసాయ పనులేముంటాయనికదా! గట్టు లంకలెయ్యడమని ఉంటుంది,అంటే గట్లని పటిష్టం చేసుకోడంతో వ్యవసాయం ప్రారంభమవుతుంది.

ఏరువాక రోజేం చేస్తారో చెప్పేరు కవి. నవధాన్యాలు మూట కడతారు,చద్దెన్నమూ మూట కడతారు, వీటితో పాటు, బెల్లమూ,పెసరపప్పూ, బియ్యంతో వండిన పులగమూ తయారు చేస్తుంది, రైతు భార్య. పసుపు, కుంకుమ తీసుకెళుతుంది. వీటినో గంపలో పెట్టుకుని, నీళ్ళు, పాల తపేలాలో తీసుకుని బయలుదేరుతుంది. ఎలా? ఏడు గజాల చీర, కచ్చపోసి కట్టి, కుడిపైట వేసి (దీన్నే తమిళులు మడికట్టు అంటారు).మామూలు రోజుల్లో ఏడమ పైట వేయడమే మన అలవాటు. ఇక రైతు పంచకట్టి, రెండుపక్కలా జేబులున్న కంటి మెడ బనీను తొడిగి, తలకు పాగా చుట్టి,ఎడ్లను కాడికి పూన్చి, భుజాన నాగలి ఎత్తుకుని చేత ముల్లు గఱ్ఱ (దీని గురించి వేరు టపా ఉంది) పట్టుకుని, బయలుదేరుతాడు. పాలేరు కొత్తవాడు పనిలో ప్రవేశించడం, పాత వారు కొనసాగడం ఈ రోజుతో మొదలు.

చేలో వీలున్నచోట చిన్న మడి చేసి దానిలో నీరు చల్లి, తెచ్చిన నవధాన్యాలు వేసి పసుపు కుంకుమలతో పూజచేసి, తెచ్చిన పులగాన్ని నైవేద్యం పెట్టి, దానిని తీసుకుని మెతుకులుగా విడతీసి తాను వ్యవసాయం చేయబోయే చేను మొత్తంలో ’పొలి”పొలి’ అని కేకలేస్తూ చల్లుతాడు. ఇల్లాలు లేక వ్యవసాయం లేదు, కుటుంబం లేదు,జీవితం లేదు. అది సూచిస్తూ ఏరువాక సాగేటపుడు ఇల్లాలు కూడా ఉండాలన్నారు. ఈ తరవాత నుంచి వ్యవసాయపనులు మొదలు పెడతారు,అదును బట్టి.

పాత కాలపు రైతు ప్రకృతిని నిత్యమూ గమనించేవాడు. సూర్య చంద్రుల చుట్టూ వలయం ఏర్పడుతూ ఉంటుంది,వర్ష కాలంలో, దీన్నే గుడికట్టడం అంటారు, రైతుల పరిభాషలో, అదే వరద గుడంటే. ఇది రైతుకు వర్ష సూచన చేసేది. సూర్య చంద్రులకు దగ్గరగా గుడి కడితే వర్షాలు ఆలస్యంగా పడతాయని, దూరంగా గుడికడితే తొందరలో వానలుపడతాయని సూచన. వర్షాలు పడితే వాగులు,వంకలు పొర్లి ప్రవహిస్తాయి, ఆరోజుకి వ్యవసాయం ఎక్కువగా వర్షాధారమే! చినుకు పడితే భూమి పులకిస్తుంది, పచ్చని చిగురు మొలకెత్తుతుంది.

నేడంతా యంత్ర వ్యవసాయమే,పశువులు పల్లెలలో కూడా కనపడటం లేదు. నాలుకు అరకల వ్యవసాయం, నాలుగు కాళ్ళ వ్యవసాయం అనేవారు అంటే ఎనిమిది ఎద్దులను రైతు కలిగున్నాడని అర్ధం, నాలు కాళ్ళు అంటే (కాడికి బహువచనం కాళ్ళు అనేశారు) నాలుగు అరకల వ్యవసాయమనే అర్ధం.

నాగలికి నాలుగు భాగాలు. ఎడ్లను కట్టేదాన్ని కాడి అంటారు. కాడి నుంచి పొడుగ్గా ఏటవాలుగా ఉండేదాన్ని పోలుగర్ర అంటారు. ఈ పోలుగర్రను నాగలి దుంపలో అమరుస్తారు. నేలను చీల్చే ఇనపకర్రు ఉన్నదానిని నాగలి దుంప అంటారు. పోలుగర్రను ఇందులో ఇమిడ్చి చివరగా మేడిని తగిలింది ఒక చీల వేసారు. ఇంతతో సరిపోలేదు. ఈ నాగలిని కాడిని అనుసంధానం చేసేదే మోకు. మేడి వెనకనుంచి, మేడిని నాగలిదుంపని గట్టిగా పట్టి పోలుగర్రతో ఉంచుతుంది, ఈ మోకు, చివరకు కాడితో అనుసంధానం అవుతుంది. దీన్నే కోటేరు పన్నుకోడం అంటారు, ఇది సరిగా కనక చేసుకోకపోతే నాగలి దుంప ఊడి వస్తుంది,దున్నేటపుడు. ఇక ఎడ్లని ఎలపట,దాపట ఎడ్లు అంటారు. కుడివైపు ఎద్దును ఎలపట ఎద్దు,ఎడమవైపు ఎద్దును దాపట ఎద్దు అంటారు. ఈ ఎడ్లు ఏపక్క కాడికి కట్టే అలవాటుంటే, అటే పని చేసేందుకు కట్టాలి. మార్చి కడితే ఎద్దు పని చెయ్యలేదు. రైతుకు ఈ ఎడ్లలో తేడా తెలిసి ఉంటుంది. ఒక వేళ రైతు మరచినా ఎడ్లని కాడికి పూన్చడానికి తీసుకెళ్ళి వదిలేస్తే తనంత తనే ఏ పక్క పని చేసే ఎద్దు ఆ పక్క చేరిపోతుంది, అదీ విచిత్రం.

ఇక సాలు తప్పకుండా పంట వెయ్యమన్నారు. అదును తప్పిన వ్యవసాయం ఫలించదు. వ్యవసాయానికి కావలసినవి రెండు. ఒకటి అదును అనగా సరైన సమయం, రెండవది పదును అనగా భూమిలో తడి. నిజజీవితంలో కూడా అదును తప్పినదేదీ ఆనందంగా ఉండదు. చదువుకోవలసిన సమయంలో చదువుకోవాలి, సంసార బాధ్యతలు తీసుకోవలసిన సమయంలో వాటిని తీసుకోవాలి, అలాగే అదునుకే పిల్లల్నీ కనాలి, అప్పుడే వారు ముదిమికి బాసటవుతారు.

విత్తనాలు చల్లుకోవడం ఒక కళ. ఇది అందరివల్లా కాదు. విత్తనాల గంప ఎడమ చంకలో ఇరికించి పట్టుకుని, కుడి చేత కొద్దిగా విత్తనాలు తీసుకుని గుప్పిట మూసి, చూపుడు వేలు,బొటన వేళ్ళు మూస్తూ తెరుస్తూ విసురుగా చల్లితే సమానంగా విత్తనాలు చాళ్ళలో పడతాయి. ఒక్కో రైతు జిల్లిన విత్తనాలు వరుసలలో పేర్చినట్టు పడతాయి. అదీ కవిగారి హృదయం.

ఈ పాట మొదటి భాగానే ఇంతయింది,టపా పెరిగింది, మిగిలిన భాగంలో నాటి రాజకీయ,ఆర్ధిక,సాంఘిక స్థితులను చూదాం.

శర్మ కాలక్షేపంకబుర్లు-బస్సులో హరేరామ

బస్సులో హరేరామ

అబ్బో! ఇదెప్పటి మాటా? డెబ్బై ఐదేళ్ళకితం మాటకదూ!

నాకు ఊహ తెలిసిన తరవాత మొదటి సారిగా బస్సెక్కేను అమ్మతో,గోకవరం నుంచి రాజమంద్రి కి. అది బొగ్గుబస్సు, రోజూ చూస్తూనే ఉండేవాళ్ళం గాని లోపలికెక్కెలేదు. బస్సెక్కిన తరవాత పరిశీలించాను. డ్రైవర్ దగ్గర ”దేవుని స్మరింపుము” అని ఎర్ర అక్షరాలతో రాసుంది. ఏంటో అర్ధం కాలేదు. ఆ తరవాత చూస్తే బస్సులో టాప్ కింద మూడు పక్కలా ఇలా రాసుంది. హరేరామ హరేరామ రామరామ హరేహరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. నాకప్పటికున్న ఊహతో ఈ అక్షరాలు కూడబలుక్కుని చదివేను. అమ్మ కొంగు పట్టుకుని తిరగడం అలవాటుగా అందుకు అమ్మ చేసే పనులన్నీ పరిశీలించడం అలవాటయింది. అమ్మ నెమ్మదిగా పని చేసుకుంటూ ఇలా హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష కృష్ణకృష్ణ హరేహరే అంటూ ఉండేది ఎప్పుడూ. అది జ్ఞాపకం వచ్చి అమ్మని అడగబోయాను గాని, మరిచిపోయా మరో హడవుడిలో. బస్సులో ఇలా ఎందుకురాస్తారు అర్ధం కాలేదు. ఇది మనబస్సు కదా అందుకు ఇలా రాసేరేమో అనుకున్నా! ఆ బస్సులో మాకూ వాటా ఉండేది,నాటి రోజుల్లో 🙂

కాలం గడుస్తోంది! రాజమంద్రి నుంచి మామయ్యగారి ఊరికి బస్సెక్కా,అమ్మతోనే! అప్పుడూ ఆ బస్సులోనూ చూశా ఇలా రాసి ఉండడం, ఏంటబ్బా అని అమ్మని అడిగేశా! ఇలా రాస్తారు,ఎందుకో తెలీదు అనేసింది అమ్మ. సమాధానం దొరకలేదు,ప్రశ్న అలాగే ఉండిపోయింది. కాలం గడిచింది, ఒకసారెవరో ఒక పెద్దాయనతో మాటాడుతూ ఉండగా ఈ అనుమానం వెలిబుచ్చా! దానికాయన, ఒక బ్రేక్ ఇనస్పెక్టర్ గారికి ఈ మంత్రం అంటే అమితమైన అభిమానం అందుకు బ్రేక్ సర్టిఫికట్ కావలసిన బస్సులలో ఇలా రాస్తే ఆయన సంతోషించేవాడట, పైస కూడా లంచం తీసుకునేవాడు కాదట. లంచం తీసుకోనందుకుగాను ఆయన చెప్పకనే అందరూ ఇలా హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరే హరే అని రాయించేవారట. ఆ తరవాత కాలంలో ఆర్.టి.సి బస్సులొచ్చాయి, వీటిలో చిల్లర తెచ్చుకోవలెను, జేబుదొంగలున్నారు, చేతులు బయట పెట్టరాదు, వగైరాలు రాసి ఉండేవి. ఇప్పటికి లారీలలో డ్రైవర్ దగ్గర దేవుని స్మరింపుము అని రాస్తూనే ఉన్నారు.

ఇక లారీల వెనక చిన్న కార్ల వెనక రాసేవాటి గురించి చెప్పుకోవాలంటే!

లారీలైతే ’అందగాడివే! నావెనక పడకు’ ’నన్ను చూసి ఏడవకు’ ’దేవుని దీవెన’ ’యేసే రక్షకుడు’ ’నన్నుకాదు! రోడ్డు చూడరా’ ’సోగ్గాడు’ ’సోగ్గాడు సోమరాజు’ ’ఏ ఊరు మనది’ ’ఇంటి దగ్గర చెప్పొచ్చావా?’ ’నా కూడా రాకు’ ’నావెంట పడకు’ ’మందేశావా?’ ’మీదపడకు’ ’దూరంగా నిలబడలేవూ?’ ’పెళ్ళయిందా?’ ఇలా రాయడం అలవాటు, ఎప్పుడయిందో చెప్పలేనుగాని, కొన్ని కొన్ని కళాత్మకంగానూ,సందేశాత్మకంగానూ ఉన్నాయి.

ఇక ౘిన్నకార్లు ఐతే
’ ఓం’ ’అమ్మ దేవెన’ ’యేసే దైవం’ ’ప్రభువే రక్షకుడు’ ’అమ్మ బహుమతి’ ఇలా రాస్తూ వస్తున్నారు. వీటిలో ఎక్కువ మతాన్ని సూచించేవే.

ఎవరిష్టం వారిది

శర్మ కాలక్షేపంకబుర్లు-బతికి చెడ్డవాడు.

బతికి చెడ్డవాడు.

బతికి చెడడం,చెడి బతకడం అంటుంటారు,వీటికి అర్ధం జయంతికి వర్ధంతికి ఉన్నంత తేడా ఉంది 🙂

ఇది ఏభై ఏళ్ళకితం జరిగిన సంఘటన.

ఉద్యోగం రావడంతో స్వంత ఊరునుంచి మకాం ఎత్తేసిన తరవాత పొలం వెళ్ళాలంటే అడ్డదోవన వెళ్ళి వచ్చేయడం జరుగుతోంది, ఊళ్ళో కి వెళ్ళకపోవడం తో సంగతులూ తెలియడం తగ్గింది. మా వూరు మీంచి కొత్తగా బస్సు వేశారంటే బస్సు మీద బయలుదేరా. బస్సు ఊరి సెంటర్ లో దిగుతుంటే ఒకతను పలకరించాడు, ”బావగారు బాగున్నావా” అంటూ, ముద్ద మాటతో. చూస్తిని కదా ఆ పలకరించిన వ్యక్తి తల గూళ్ళబుట్టలాగా,గెడ్డం పిచిక గూడులాగా బాగా పెరిగి, చిరిగిన చొక్కా,ఒక తువ్వాలు గోచీతో, కుడిచెయ్యి,కాలు ఈడుస్తూ నడుస్తున్నట్టుంటే, ఎడమచేతిలో కర్ర, చేతిలో సంచితో, అడుక్కునేవాడిలాగా అనిపించాడు. గుర్తు పట్టలేకపోయా! ”నేను బావా కాఫీ హొటల్ వెంకట్రావుని” అనడం తో గుర్తుపట్టి,ఆశ్చర్యపోతూ, ”ఏంటి ఇలా అయ్యావు” అన్నా! అలా రెండడుగులు నెమ్మదిగా వేసి పక్కనే ఉన్న సీను కిల్లీ కొట్టు,చిట్టిపంతులుగారి సైకిల్ షాపు, సూర్నారాయణ బియ్యంకొట్టు ఉన్న అరుగు దగ్గరకి చేరాను. వెంకట్రావు కూడా వచ్చి మెట్ల మీద కూలబడ్డాడు. అతనేదో చెబుతున్నాడుగాని నాకర్ధం కాలేదు.

ఇది చూసిన బియ్యం కొట్టు సూర్నారాయణ కలగజేసుకుని, ”మీరు ఊర్నుంచెళ్ళేకా చాలానే జరిగేయి. ఇతనికి ఆ అలవాటుందని కదా, ఇతని పొలం నాలుగెకరాలూ, ఇల్లూ పెళ్ళాం పేరున రాయించారు. హోటల్ నడుపుతుండేవాడు, లాభాల్లోనే నడిచింది,ఇతని కున్న అలవాటుతో కడుపులో నొప్పికి ఆపరేషన్ చెయ్యలిసొచ్చింది. చేసేవాళ్ళు లేక హోటల్ మూతబడింది, కొన్నాళ్ళు ఇతని భార్య కొడుకు నడిపినా, కుదరలేదు, వాళ్ళవల్ల కాలేదు. ఉన్న డబ్బు అయిపోయింది, ఇంతలో కొడుక్కి పెళ్ళి చేసేరు, ఇతని వైద్యానికి సొమ్ము కావలిసొచ్చింది. పులి మీద పుట్రలా ఇతనికి పక్షవాతం వచ్చి కుడికాలు చెయ్యి పడిపోయాయి, మాటా పడిపోయింది. ఆ తరవాత కొద్దిగా మార్పొచ్చి ఇలా ముద్దగా మాటాడతాడు. ఇంట్లో ఏదో గొడవ జరిగింది, ఇతని భార్య,కొడుకు,కోడలు ఇతన్ని ఇంట్లోంచి గెంటేసి ఇల్లమ్మేసి,డబ్బుచ్చుకుని మరో ఊరు దూరంగా పోయారు,చెయ్యి కాలు పూర్తిగా స్వాధీనంలో కి రాలేదు. ఇతన్ని చూసేవాళ్ళూ లేరు. ఊరంతా ఇతనికి కావలసిన వాళ్ళే కాని ఒక పూట ముద్ద పెట్టేవాళ్ళు లేరు”,అన్నాడు.

వెంకట్రావు సంచిలో లావుపాటి అరఠావు మడత పెట్టి కుట్టిన తోక పుస్తకం కనపడింది. అది పద్దు పుస్తకం,చాలా కాలం నేను వారానికోసారి అందరి కాతాలూ కూడి, బాకీలు తేల్చిన పుస్తకం, అతనికి సాయంగా. ఆ రోజుల్లో అందరికి ఇతని హొటల్లో కాతా ఉండేది, రోజువారీ టిఫిన్ చేసినవాళ్ళు కాతా పుస్తకంలో రాసిపోయేవారు. వారానికోసారి ఇచ్చేవాళ్ళు,నెలకోసారి ఇచ్చేవాళ్ళు, వీలుని బట్టి ఇచ్చేవాళ్ళు, సంవత్సరానికోసారి బాకీ తీర్చేవాళ్ళూ ఉండేవారు.

వెంకటరావు ఆ పుస్తకం తీసిన తరవాత సూర్నారాయణ అందుకుని ”ఈ కాతా పుస్తకం ఆస్తిగా బయట పడ్డాడు. నాకు ఈ పుస్తకమిచ్చి పద్దులు చూడమంటే ఇచ్చేసిన పద్దులు సున్నా చుడుతూ, మిగిలినవాటిని సరి చూసి ఇచ్చా! దీన్ని పుచ్చుకుని తిరిగుతింటాడు,బాకీల కోసం, చాలా బాకేలే ఉన్నాయి. బాకీ చెల్లేసిన వాడు లేడు. ఇతనికి ఎవరేనా ఒక ముద్ద పెడితే కలదు,లేకపోతే లేదు. ఈ సంచితో అలాగే ఎక్కడో ఒక అరుగుమీద పడుకుంటాడు” అని చెప్పి ముగించాడు.

నాకైతే కడుపులో దేవినట్టే అయింది, ఎలా బతికినవాడు, ఎలా అయిపోయాడని. పుస్తకం చేతిలోకి తీసుకుని పేజీలు తిరగేస్తున్నా! బాకీ చెల్లు వేసిన కాతాలు సున్నాలు చుట్టి ఉన్నాయి. రావలసిన కాతాల్లో సొమ్ము రావలసిందీ కనపడుతోంది. అలా చూస్తుండగా నా కాతా పేజి కనపడింది. అది సున్నా చుట్టి ఉంది. ఒక సారి కూడిక మళ్ళీ చేశా! ఐదు రూపాయలు తీసి వెంకట్రావు చేతిలో పెట్టి నా కాతాలో కూడిక తప్పు,నీకు ఐదు బాకీ ఉన్నా అని అతని చేతిలో డబ్బులు పెట్టి,వెను తిరిగి చూడక పరుగులాటి నడకతో వెళిపోయా!

శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళికుదిరితే …..

పెళ్ళికుదిరితే …..

      పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది,పిచ్చి కుదిరితే పెళ్ళి కుదురుతుందని ఒక సామెత. ఎంతకీ తెగని సమస్యకి అనగా సమస్యల గొలుసుకి ఇది తార్కాణం. ఒక సమస్య తేలితే మరొక సమస్య తేలుతుంది, ఇది అది ముడిపడి ఉంటాయనమాట. ఏదీ జరగదు సమస్య తేలదు. జీవితంలో ఇటువంటివి ఎదురవుతూనే ఉంటాయి, ఏమీ చేయలేక,సమస్య పరిష్కరించుకోలేక కాలానికి,దైవానికి దానిని వదిలేసి ఊరుకుంటాం. ఇదిగో ఇటువంటి సమస్యలనే ఎదుటివారు, కావలసినవారమని, రేపి బాధపడుతున్నట్టు నటిస్తూ బాధపెడుతుంటారు. ”ఏం వదినా! మీ అమ్మాయికి పెళ్ళి సంబంధం కుదురుతోందన్నావు, ఏమయిందీ?” ఇది తెలిసి కెలుకుతూ వేసిన ప్రశ్న. ఎద్దు పుండు కాకికి నొప్పా? పెళ్ళి కుదిరితే సామెత గురించి మొదలెట్టి ఇలా పోచుకోలు కబుర్లు చెప్పడం బాగుందా అంటారా? వస్తున్నా! వస్తున్నా!! 🙂 ఈ సామెత గురించి ఒక కత చెప్పుకుందాం,చిన్నదే! సరేనా! ఊ అన్నారా? 🙂

అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక బాగా కలిగిన కుటుంబం, ఒకడే కొడుకు, లేకలేక కలిగాడు. అల్లారు ముద్దుగా పెంచారు, తెలివితేటల మాట దేవుడెరుగుగాని కుర్రాడు మాత్రం ఎర్రగా బుర్రగా పెరిగాడు, జాంపడులా. వయసొచ్చింది, పెళ్ళి చేయాలని నిశ్చయించారు, తల్లితండ్రులు. కలిగిన కుటుంబం, జాంపడులాటి కుర్రాడేమో పెళ్ళి సంబంధాలు విరగబడి మీద పడుతున్నాయి. పెళ్ళిళ్ళ పేరయ్యలు రోజుకో సంబంధం తెస్తున్నారు. సంబంధాలు చూస్తున్నారు. అబ్బాయికి అమ్మాయి నచ్చకా, అబ్బాయికి అమ్మాయి నచ్చితే వియ్యపురాలికి లాంఛనాలు నచ్చకా, ఇవి రెండూ నచ్చితే వియ్యంకుడికి కట్నం నచ్చకా, ఇవన్నీ నచ్చుబాటైతే అమ్మాయి వంశం గౌరవం హోదా నచ్చకా సంబంధాలు తిరిగిపోతున్నాయి. ఇదెంతదాకా అంటే ఎవరేనా పెళ్ళిళ్ళ పేరయ్య వీరి సంబంధం గురించి ఆడపిల్లవాళ్ళకి చెబితే ”వారికి నచ్చదయ్యా! ఏదో ఒకటి చెప్పి కాదంటా”రనే పేరు పడిపోయేటంతగా.

కాలామాగదుగదా! నడుస్తూనే ఉంది. అబ్బాయికి ఏళ్ళొస్తూనే ఉన్నాయి. ఏమయిందో తెలీదుగాని అబ్బాయి తిక్కతిక్కగా మాటాడుతున్నాడని ఊళ్ళో వాళ్ళు చెప్పుకోడం మొదలెట్టేరు. ఇది తల్లి తండ్రులకీ అనుభవంలోకొచ్చి వైద్యుని దగ్గరకి తీసుకుపోయారు. వైద్యుడు కారణాలు విచారించి వైద్యం చేశాడు. కొంతకాలం గుట్టుగా సాగింది, గుట్టు ఎంతకాలం సాగుతుంది? అబ్బాయికి మతిభ్రమణమని అందరికీ తెలిసిపోయింది. కొంతకాలం తరవాత వైద్యుడు తేల్చినదేమంటే ”అబ్బాయికి పెళ్ళైతే ఈ మతి భ్రమణం తగ్గుతుందీ” అని. పిచ్చని తెలియడం తోనే పెళ్ళి సంబంధాలు రావడం ఆగిపోయాయి. వైద్యుడు చెప్పింది బాగానే ఉందిగాని, పెళ్ళిళ్ళ పేరయ్యలు తుపాకి దెబ్బకి కూడా కనపట్టం లేదే! పిల్లనిస్తానని వచ్చేవాడూ, చేసుకుంటాననే పిల్లా కనపట్టం లేదే! ఏం చెయ్యాలి? పెద్ద సమస్య ఐపోయింది.

పెళ్ళిళ్ళ పేరయ్యలని సంప్రదిస్తే అంతావిని, ”అలాగే చూద్దాం, నాలుగైదు సంబంధాలకి చెప్పానండీ” అని సాచేస్తున్నారుగాని ఒక్క సంబంధమూ తీసుకురావటం లేదు. పైపెచ్చు, ”ఆ రోజు చిలకలాటి అమ్మాయి,అందగత్తె,చదువుకున్నది, కుర్రాణ్ణి చూసి మోజుపడింది,అని సంబంధం చెబితే, వాళ్ళని డబ్బు లేనివాళ్ళని చులకనగా మాటాడి తిరగ్గొట్టెయ్యలేదూ! ఇప్పుడు పిచ్చాణ్ణి చేసుకోడానికే పిల్ల ముందుకొస్తుందిటా? సంబంధం చూడాలిట, సంబంధం….”అనొకడూ, ”చక్కటి సంబంధం, పిల్ల అందగత్తె,కట్నానికీ లోటు లేదు, అందరికి నచ్చింది కూడా, కాని ఏం చేసేరు, ’పెళ్ళికూతురు మేనత్త తోటికోడలు లేచిపోయిందిటా’ అని సంబంధం తిరగ్గొట్టేశారే… ఇప్పుడు సంబంధాలెక్కడినుంచి వాస్తాయిటా…. పిచ్చాడికి పిల్లనిచ్చే వాళ్ళుంటారా!” అని గొణుక్కుంటున్నారు పెళ్ళిళ్ళపేరయ్యలు. సమస్య తేల లేదు, కాలం గడుస్తోంది, పిచ్చీ తగ్గలేదు, పెళ్ళీ కుదరలేదు. మరికొంతకాలం గడిచింది. పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి కుదురుతుంది. ఏది ముందూ? కాలం గడుస్తుండగా వైద్యుడు మరికొంత ధనవంతుడయ్యాడు 🙂

పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి

పై కథకి కొనసాగింపే ఈ సామెత కూడా దాని కతే మిగిలినదిన్నూ…

కొంతకాలం గడిచింది, బ్రహ్మచారి ముదిరిపోయాడు, తల్లితండ్రులలో, తల్లి ఉండబట్టలేక ఒక పెళ్ళిళ్ళ పేరయ్యను పట్టుకుని ”అన్నయ్యా! కుర్రాడు ముదిరిపోతున్నాడు, ఇంత ఆస్థిపాస్థులకు వారసులు లేకుండాపోతారేమోననే దిగులు పట్టుకుందయ్యా! లేనింటి పిల్లనైనా సరే! పెద్ద అందగత్తె కాకపోయినా బాధలేదు, అందం కొరుక్కుతింటాముటయ్యా! పిల్లను చూసి మూడుముళ్ళూ వేయిస్తివా,చచ్చి నీకడుపున పుడతా! నాలుగేళ్ళలో, నీ కూతురు పెళ్ళి చేయాలి నువ్వు, దానిని సకల ఖర్చులతో నిర్వహించే బాధ్యత నాది,నన్ను నమ్ము” అని బతిమాలి, బులిపించినట్టు మాటాడితే, మెత్తబడిన పేరయ్య కాలికి బలపంకట్టుకుని పెళ్ళి కూతుళ్ళ వేటలో పడ్డాడు. పెళ్ళి కూతుళ్ళ తల్లితండ్రులకి వీరి గురించి వైనవైనాలుగా కొత్తగా చెప్పేడు. ”కొంతకాలం అబ్బాయి మతిభ్రమణంతో బాధపడ్డమాట నిజమే! ఇప్పుడు బాగున్నాడు,తెలివైనవాడూ! ఒక సారి అబ్బాయిని చూడండి, నచ్చితేనే చేద్దాం, చూడ్డానికేం పోయే” అన్నాడు. దానికి తల్లితండ్రులు పిచ్చాడికి పిల్లనివ్వడానికెళుతున్నామంటారయ్యా! ఎగతాళీ చేస్తారూ” అన్నారు. ”అదా మీ అనుమానం, పిల్లనివ్వడానికెళుతున్నట్టు తెలియనివ్వద్దూ, దారేపోతూ చుట్టం చూపుగా వెళ్ళినట్టు రండి, ఆ సమయానికి నేనూ వస్తా,చూడండి, ఒక రోజుండండి,చూడండి, నచ్చితేనే” అని బలవంతం మీద ఒప్పించాడు. ఒక రోజు అమ్మాయి తల్లి తండ్రులు చూడ్డానికి ఒప్పుకుని వచ్చారు, అనుకున్నట్టే సమయానికి పేరయ్యా చేరాడు.

అబ్బాయితోనూ అబ్బాయి తల్లితండ్రులతోనూ మాటాడుతూ వచ్చారు, అమ్మాయి తల్లి తండ్రులు. చూస్తే అబ్బాయి బాగున్నవాడేనేమో, పిచ్చి లేదేమో, ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారమేమో అనిపించింది, కొంత సేపటికి. సాయంత్రమవుతుండగా, అబ్బాయి తల్లితండ్రులు,అబ్బాయి,అమ్మాయి తల్లితండ్రులు, పెళ్ళిళ్ళ పేరయ్య తీరుబడిగా కూచుని లోకాభిరామాయణం చెప్పుకోడం మొదలెట్టేరు, ఇంతలో అమ్మాయి తల్లికి, లోపల ఉన్న అనుమానం తొలుస్తుండగా, అబ్బాయితో ”బాబూ! నీకేదో అనారోగ్యం చేసిందిట,ఇప్పుడెలా ఉందీ” అని ప్రశ్నించింది. దానికి అబ్బాయి ”పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి” అన్నాడు. ఈ మాట విన్న అందరూ విస్తుపోయారు. అమ్మాయి తల్లి ఐతే ఒక క్షణం మూర్ఛపోయినంతై తేరుకుని మొగుడితో ”ఇంకా కూచున్నావేంటీ?” అంటూ చరచరా వెళ్ళిపోయింది…… ఇంకేముంది……

అదండి పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి కత.

శర్మ కాలక్షేపంకబుర్లు-చావా చావడు-మంచమూ ఇవ్వడు.

చావా చావడు-మంచమూ ఇవ్వడు.

     చావనూ చావడు మంచమూ ఇవ్వడని ఒక నానుడి చెబుతారు. ఒక చిన్న కత.

ఒక లేని కుటుంబం, పెద్ద కుటుంబం. ఉన్నదొకటే మంచం. పెద్దవయసున్న ఇంటిపెద్ద పడుకుంటాడు దాని మీద, మిగిలిన అందరికి నేలే గతి. ఇలా జరుగుతుండగా ఆ ఇంటికోడలు ప్రసవించింది, చిన్న పిల్లవాడితో కింద పడుకుంటోంది, చలి కాలం బాధ పడుతోంది. ఇక ఇంటి పెద్దది వచ్చే ప్రాణం పోయే ప్రాణం లాగా ఉండటం తో మంచం మీంచి దించుతున్నారు, పోతాడేమోనని. కొంతకాలం తరవాత మళ్ళీ కుదుటపడితే మంచం మీదకి చేరుస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? మంచం మీద చనిపోకూడదనేది ఒక నమ్మకం. అందుకు ప్రాణం గుటుకు,గుటుకూ మంటుంటే కిందకి దింపేస్తున్నారనమాట. ఇలా జరుగుతుంటే, మంచం పురటాలికి ఎలా వేస్తారు? ఇలా చస్తాడనుకుని మంచం దింపేస్తే బతుకుతున్నాడు, బతుకుతాడని మంచం మీద ఉంచేస్తే చస్తాడేమోనని భయం. మంచం మీద ముసలాడు చస్తే ఊళ్ళోవాళ్ళు ఆడిపోసుకుంటారని భయం..ఏదో ఒకటవుతుందిలే అని కిందుంచేస్తే ”ఒరే బతికుండగానే చలికి చంపేస్తార్రా” అని లోకులంటారేమోనని భయం. అంచేత ప్రాణం గుతుకూ గుటుకూమంటే మంచం దింపుతున్నారు, బాగుంటే మంచం ఎక్కిస్తున్నారు. పోతే మంచం పురటాలికి వేసెయ్యచ్చు నిశ్చింతగా, చావా చావడు మంచమూ ఇవ్వడని, మంచం అలాగే ఉంటోంది,వాడుక తక్కువై. ఇదీ చావా చావడు మంచమూ ఇవ్వని కత… ఇదెప్పుడెందుకూ? … ఇదీ అసలు కత.

పండగొస్తోందంటే అదే పెద్ద పండగొస్తోందంటే మా నెట్ కి ఇలాటి పరిస్థితే వస్తుంది. అదేమని కదా మీ అనుమానం. పండగకి జాతరలు,సంబరాలు చేస్తారు,పల్లెలలో. దానికోసం పందిళ్ళూ వేస్తారు,అలంకరణా చేస్తారు. ఇలా రోడ్ల మీద పందిళ్ళు వేయడానికి రాట(గుంజ)లు పాతుతారు, చాలా లోతుగా. ఈ నెట్ కేబుల్ చాలా లోతులోనే ఉంటుంది, కాని అది కూడా పాడయ్యేటంత లోతుకి పాతుతారీ గుంజలు. ఇక చెప్పేదేమి? మా వాళ్ళు పొలో మని పోతారు,వెతుక్కుంటూ. ఏ గుంజ కేబుల్ ని పాడుచేసిందో కనుక్కుంటారు. గుంజ తీసేస్తే పల్లెటూరివాళ్ళు తాట తీస్తారు. మరెలా? ఏం చేస్తారు? వాళ్ళని ఒప్పించి గుంజ తీసి గొయ్యి తీసి గబగబా కేబుల్ అతికించి మళ్ళీ గొయ్యి పూడ్చేస్తారు. ఇది ఓ.ఫ్.సి కేబుల్ కదా కొన్ని ఇబ్బందులుంటాయి. పూర్తిగా నెట్ పోదు అలాగని పనీ చెయ్యదు, వచ్చే ప్రాణం పోయే ప్రాణం లా కొట్టుకుంటూ ఉంటుందన మాట. పోయిందని కంప్యూటర్ కట్టేస్తే నెట్ పని చేస్తున్నట్టు కనపడుతుంది. పన్జేస్తున్నట్టుందే అని నెట్ లోకెళితే పుటుక్కునపోతుంది, అయ్యో అనిపిస్తుంది. సరే కట్టేదామంటే మళ్ళీ వస్తుంది. ఆ బాగున్నట్టుందనుకుంటే కామెంటో, టపాయో వేసేలోగా మళ్ళీ గుటుక్కుమంటుంది. ఈ లోగా మేమేం తక్కువ తిన్నామని కరంట్ వారు పావుగంటకో సారి గుటుక్కు మనిపిస్తున్నారు…. ఇలా వస్తూ పోతూ మా పండగ కాస్తా గడచిపోతుంది. మరి కొన్ని పన్జేస్తాయే! అవును, బేంక్ లు కేబుల్ టి.వి ఇలా ముఖ్యమైనవాటికి ప్రయారిటీ ఉంటుంది, సామాన్యులది వెనకబెంచీయే ఎప్పుడూ! పండగైపోయిన తరవాత పందిరి తీసిన తరవాత దీన్ని సరి చేస్తారు, అంత దాకా ఇంతే! ప్రతి సంవత్సరం జరిగేదే కదా! అంటే ఎంతమందికి చెప్పగలమండి? మీకు మాత్రం తెలీదూ? అంటారు మావాళ్ళు, ఇదింతే! రెండు రోజుల్నుంచి జరుగుతున్న కత, అదనమాట… మేరా భారత్ మహాన్.

శర్మ కాలక్షేపంకబుర్లు-త్రయోదశి

త్రయోదశి

    త్రయోదశి,థర్టీన్, పదమూడు అన్నీ పది+ మూడు అనే అర్ధం. తెలుగులో పదులస్థానం ముందు చెప్పి ఒకట్ల స్థానం తరవాత చెబుతాం, మరి ఇంగ్లీషులో ఈ ఒక్క ’టీన్లు’ తప్పించి మిగిలినవన్నీ పదుల స్థానం ముందు చెబుతాం. ఈ టీన్లు మాత్రం ఒకట్ల స్థానం ముందు చెబుతాం. మరైతే సంస్కృతంలో అంతటా ఒకట్ల స్థానం ముందు చెప్పి తరవాతే పదుల స్థానం చెబుతాం, ఎలాగంటే త్రయోదశి,అష్టాదశి అంటే మూడు తో పది, ఎనిమిదితో పది కలిగినదీ అనర్ధం. మరోమాట అష్టోత్తర శతం అంటే ఎనిమిదికి ఉత్తరంగా నూరు కలిగినది నూటెనిమిదని కదా! ఈ ఉత్తరమేంటని తమ అనుమానం కదా! ’అంకానాం వామతో గతిః’ అన్నది సంస్కృతపుమాట, అంటే అంకెలు ఎడమవైపుకు పెరుగుతాయన్నదే అది. అంకెలు ఎడమనుంచి కుడికి వేసి, కుడినుంచి ఎడమకు లెక్కించి, ఎడమనుంచి కుడికి పలుకుతాం. మరి సంస్కృతంలో కుడినుంచి అనగా ఒకట్ల స్థానం నుంచి అష్టోత్తర శతమని ఎందుకంటాం అని కదూ! ఉత్తరమెందుకంటారనేగా అనుమానం.

తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టండి, ఏమండోయ్! ఎదో చెబుతున్నారనుకుంటే ఇలా…. కాదండి బాబు నిజం తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టేరా? చేతులు బార్లాచాపండి, కుడి వైపు చూడండి ఏదిక్కదీ, దక్షిణం కదా? అలాగే ఎడమవైపు చూడండి అదేదిక్కూ ఉత్తరం కదా! ఇప్పుడు ఉత్తరం అంటే ఎడమ వైపని అర్ధం కదా! అందుకుగాను అష్టోత్తర శతం అంటే ఎనిమిది కి ఉత్తరంగా అనగా ఎడమ వైపున వంద కలదీ నూటెనిమిది. ఏంటిదీ పదమూడు చెబుతానని ఇలా దారి తప్పేరంటారా? నిజమే ఈ మధ్య అన్నిటా దారి తప్పిపోతూనే ఉందండి. దారిలో కొద్దాం. ..

అప్రాచ్యులకి పదమూడంటే భయం వరుసగా అంకెల్లో కూడా వేయరట పన్నెండు తరవాత పన్నెండు (అ) అంటారట, ఇంతకీ వీరికింత భయమెందుకంటే, ఏసు చివరివిందులో పదమూడు మందితో కలిసి భోంచేశారట! అందులో ఒకడు ఏసుని పట్టించాడట. ఇదేమండి అప్రాచ్యులని తిడతారా అనడుగుతారా! అప్రాచ్యులంటే తిట్టు కాదండీ న+ప్రాచ్యులు=అప్రాచ్యులు అనగా తూర్పు దిశకు సంబంధించినావారు కాదు, అనగా పశ్చిమదేశీయులు అని అర్ధమండీ! అప్రాచ్యులకి మూఢనమ్మకాలు లేవుగాని పదమూడంటే భయమే అలాగే మనకీ పదమూడంటే కొన్ని నియమాలున్నాయి, చూదాం…పంచాంగం అంటే ఐదు అంగములు కలిగినది ఏమవి? తొథి,వారం,నక్షత్రం, యోగం,కరణమనేవే ఆ ఐదూ!
ఇందులో తిథీ వారం కలిస్తే వచ్చే మొత్తం కనక పదమూడు ఐతే అది దగ్ధ యోగం అన్నారు మనవారు. ఆ దగ్ధ యోగాలున్నవేవీ?

షష్టీ 6+7శనివారం
సప్తమీ7+6 శుక్రవారం
అష్టమీ8+5 గురువారం
నవమీ9+4 బుధవారం
దశమీ10+3 మంగళవారం
ఏకాదశీ11+2 సోమవారం
ద్వాదశీ12+1 ఆదివారం

ఈ రోజుల్లో ఏ పని మొదలుపెట్టినా జరగదని భావం. అదేంటీ శశిరేఖా వివాహం దగ్ధయోగంలో కదూ జరిగిందంటారా? నిజమే! మాయా శశిరేఖా వివాహం మొదట్లోనే సంధికొట్టేసింది!  మరి ఇదంతా దగ్ధయోగం కాదూ 🙂

నిజమెంతో గాని చవితి ప్రయాణాని ఫలితం మరణం అంటారు, షష్టి నాడు మొదలెట్టిన పని కలహంతో ముగుస్తుందిట. అష్టమినాటి పని కష్టాన్ని మిగులుస్తుంది, నవమినాటి పని వ్యప్రయాసలకే కారణం అంటారు. చిత్రం త్రయోదశినాటి పని దిగ్విజయంగా ముగుస్తుందట. పదమూడు వర్జించవలసిందికాదు, రెండు కలిస్తే పదమూడు వర్జనీయమే !

చవితి,షష్టి,అష్టమి,నవమి,
ద్వాదశి తథులను వదిలేస్తాం గనక వీటితో వచ్చే దగ్ధయోగాలను పట్టించుకోం. ఇక దశమి మంగళవారం,ఏకాదశి సోమవారాలే మనల్ని ఇబ్బంది పెట్టేవి.తిధివారాలు కలిసి దోషప్రదమైన దగ్ధయోగాన్నిస్తాయి. నిత్యమూ చేసే పనులకి పంచాంగం చూడక్కరలేదంటారు,పెద్దలు.

పంచాంగాన్నే నమ్మం అంటే ఎదీ మనల్ని ఏమీ చెయ్యలేదు.

శర్మ కాలక్షేపంకబుర్లు-sixth letter O square L

sixth letter O square L

అవి స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజులు. తెల్లదొరల స్థానాల్లో నల్లదొరలు, పరిపాలకులుగా, అధికారులుగా కుదురు కుంటున్న కాలం. కొత్తగా అధికారులుగా కుదురు కుంటున్న నల్లదొరలలో రిటయిర్డ్ మిలిటరీ ఆఫీసర్లు కూడా ఉండేవారు. కోస్తా జిల్లాలలో ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసూ. తనిఖీ కొస్తున్నట్టు తంతి వార్త, ఆఫీస్ సిద్ధమైయింది. చిన్నదొర ఎదురెళ్ళి స్టేషన్ నుంచి పెద్ద దొరని తీసుకొచ్చాడు. మిలిటరీ ఆచారం ప్రకారంగా పెద్ద దొరొచ్చేటప్పటికి అందరూ వరుసలలో నిలబడి పెద్దదొరకి స్వాగతం చెబుతుండగా చిన్న దొర సిబ్బందిని పెద్దదొరకి పరిచయాలు చేస్తూ వచ్చాడు.

ఆఫీస్ తనిఖీ మొదలయింది, కొత్తగా వచ్చిన ఓ కుర్రగుమాస్తాకి పెద్ద దొరకి వాదన మొదలయింది, తనిఖీ రెండవరోజు. పెద్దదొర కుర్ర గుమాస్తా చెప్పినదంతా విని చివరికి ‘It seems you are a fool’ అనేశాడు. ఒక్క క్షణం ఆఫీస్ సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం అయిపోయింది. కొద్ది క్షణాల తరవాత, ఆఫీస్ వారంతా తేరుకుని ఎవరిపనిలో వాళ్ళు పడిపోయారు, పెద్దదొర మరో పనిలో పడ్డాడు. కాని, కుర్రగుమాస్తా ఉడికిపోయాడు,ఏం చెయ్యలేడు. ఎదుటివాడు పెద్ద ఆఫీసరు, ఓపిక పట్టేడు..

చివరిరోజైన మూడో రోజు పెద్దదొర వీడ్కోలు సందేశమిచ్చి, వరుసలో నిలబడ్డ ఒక్కొకరితో చేతులు కలుపుతూ వస్తున్నాడు. కుర్ర గుమాస్తా దగ్గరకొచ్చేటప్పటికి, కుర్ర గుమాస్తా ‘I refuse to shake hands with a fool’ అనేశాడు. ఒక్క సారి మళ్ళీ అంతా నిశ్శబ్దం, పెద్దదొర తేరుకుని ముందుకెళిపోయి, కారెక్కేసేడు.

అంతా చూస్తూ ఉన్న చిన్నదొర పిసుక్కుంటున్నాడు, పరుగున పెద్దదొర ఎక్కిన కార్ దగ్గర నిలబడి, కుర్ర గుమాస్తాపై ఏం చర్య తీసుకోమంటారని అడిగాడు, వినయంగా. పెద్దదొర చిరునవ్వు నవ్వి You are a sixth letter O square L అనేసి వెళిపోయాడు.

మా సీనియర్లు చెప్పుకునే ఆఫీస్ కతల్లో ఇదోహటి.

శర్మ కాలక్షేపంకబుర్లు-డొక్క చించి డోలు కట్టిస్తా!

డొక్క చించి డోలు కట్టిస్తా!

   తెనుగునాట ఈ మాట చాలా విరివిగా వాడతారు, బెదిరించడానికి. డొక్క చీల్చడమేంటో? డోలు కట్టించడమేంటో? తెలుసా?

డొక్క అంటే కడుపు అని అర్ధం. కడుపంటే నానార్ధాలున్నాయి కాని ఇక్కడ కడుపంటే తిండి తింటే నిండేది 🙂

ఇదిగో ఈ కడుపును చింపేస్తాననడమన్నమాట, అంటే కడుపు కోసేస్తా లేదూ కడుపుమాడ్చి చంపేస్తానని అర్ధం. మరిడోలు కట్టించడం 🙂

పూర్వంరోజుల్లో శవాన్ని డోలు సన్నాయితో శ్మశానానికి తీసుకుపోయేవారు

ముసలాడింట్లో చస్తాడేమోనని చల్లో వీధిలో పారేసే కొడుకులు కోడళ్ళున్నకాలం,అద్దెఇస్తున్న ఇంట్లో చస్తే తీసుకెళ్ళేలోగా కూడా ఇంట్లో ఉంచకూడదంటున్న ఓనర్ల కాలం,ఇక నలుగురు మోసుకెళ్ళేందుకెక్కడ దొరుకుతారు? ధర్మాత్ములు తోపుడు బళ్ళు,తొట్టి రిక్షాలు, వేన్లు శవాలని మోసుకు పోయేందుకు ఉచుతంగా ఏర్పాటు చేస్తున్నకాలంలో, తప్పనివారెవరో దగ్గరూంటే తప్పక శవంతో వెళుతున్నకాలం

పాతరోజుల్లో ఆరోజు చనిపోతే ఆ రోజే అంత్యక్రియలు చేసేవారు. దానికీ అబ్బో! చనిపోయినవారి పట్ల ఎంత గౌరవం చూపేవారో! డోలూ సన్నాయి పెట్టేవారు,శ్మశానం దాకా. శవంతో పాటు ఊళ్ళో అందరూ వెళ్ళేవారు. కలిగినావారైతే బుక్కా గుండ, పువ్వులు, రూపాయలు చల్లుతూ శవాన్ని మోసుకుపోయేవారు. ఇంత వైభవంగా పీనుగును తీసుకెళ్ళే సంస్కృతి. అలా మేళతాళాలు పెట్టడమే డోలు కట్టించడం.

ఇప్పుడంటే చచ్చినవాళ్ళని మూడురోజులుపాటు ఐన్ బాక్సుల్లో పెట్టి ఉంచుతున్నారు, కొడుకులూ,కూతుళ్ళూ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉంటున్నారుగా, వాళ్ళొచ్చేకా తీసుకుపోతున్నారు. తక్కువలో తక్కువ మూడు రోజులు. కొన్ని చోట్ల వాళ్ళు మేం వచ్చిమాత్రం వచ్చి చేసేదేముంది అదేదో మీరే కానిచ్చేద్దురూ మొత్తం ఎంతవుతుందో చెప్పండి,డాలర్లు పంపుతా అంటున్నారు. కార్యక్రమం ఘనంగా చేయించండి, ఒక వీడియో తీసి పంపమనీ అంటున్నారు.

అంటే చివారాఖరిమాట డొక్కచింపి డోలు కట్టిస్తా అంటే చంపి శ్మశానానికి సగౌరవంగా పంపుతానని, అదండి సంగతి.